Breaking News

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్​ కిడ్నాప్​..టీడీపీ నేత హ్యాండ్​​!

బంజారాహిల్స్​ కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్​ బుధవారం కిడ్నాప్​కు గురయ్యాడు. కిడ్నాప్​ చేయించింది టీడీపీ నేతేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి కోట్ల రూపాయల నగదు, భూమి పత్రాలు తీసుకొని వదిలేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌కుకు కడప జిల్లాకు చెందిన ఓ భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో శివగణేశ్​ను కొండారెడ్డి మనుషులు కిడ్నాప్​ చేసి ఆ భూమిని దక్కించుకొనేందుకు స్కెచ్​ వేసినట్టు సమాచారం.

కడప జిల్లా ప్రొద్దుటూరులో అగస్తేశ్వర దేవస్థానానికి చెందిన 18 ఎకరాల భూమిని 50 ఏళ్ల కిందట దేవరశెట్టి దంపతులు ఓ ట్రస్ట్ పేరుతో కొనుగోలు చేశారు. అనంతరం అక్కడ కళాశాలను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మిగిలిన 11 ఎకరాలను విక్రయించేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులతో కలిసి ట్రస్ట్​సభ్యులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డిని కలిశారు. అయితే దేవాలయ భూమిని విక్రయించేందుకు సీఎం వైఎస్​ఆర్​ అనుమతి ఇవ్వలేదు. ఈ తర్వాత సీఎం అయిన కిరణ్​కుమార్​రెడ్డి ఆ భూమిని విక్రయించుకొనేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో 11 ఎకరాల భూమిని 6.97 కోట్లకు ట్రస్ట్ సభ్యులు అమ్మేశారు. ఆ సమయంలో ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన శివగణేశ్‌.. ఎకరం భూమిని ఎమ్మెల్యేకి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ప్రస్తుతం ఆ భూమి విషయంలో శివగణేశ్​కు, వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి వివాదం నెలకొన్నది. అక్కడ రెండెకరాలు తనకు ఇవ్వాలంటూ కొండారెడ్డి పట్టుబట్టాడు. ఆ భూమికోసం శివగణేశ్​ను కిడ్నాప్​ చేయించినట్టు సమాచారం.