సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: గ్యారెంటీలు కాదు.. గారడీ మాటలు, 420 హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన బిజినేపల్లితో పాటు తిమ్మాజిపేటలో రోడ్ షో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. కేసీఆర్ అమలుచేసిన పథకాలే తప్ప.. ఇంతవరకు రేవంత్ రెడ్డి అమలుచేసిన పథకాలేవీ లేవన్నారు. ఉత్తిగొప్పలు చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తాచాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతకుముందు ఆయన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ మండలంలో గణ్యగుల, చందుబట్ల, పెద్దముద్దునూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలు అమలుకాకుండా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలకు నీరందక రైతులు, తాగునీరు అందక ప్రజలు సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీలో కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.