Breaking News

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: భారీవర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి రూ.ఐదుకోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షలచొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే, చాలా చోట్ల చెరువుల ఎఫ్​టీఎల్​ పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయం అయ్యాయని సీఎం చెప్పారు. అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీఎం వెల్లడించారు. అపార్టుమెంట్​ సెల్లార్లలో నీళ్లు నిల్వకుండా ఉండే ఏర్పాటు నిర్మాణ సమయంలోనే చేసి ఉండాల్సిందని సీఎం చెప్పారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని ఆదేశించారు. కాలనీలు, అపార్టుమెంట్లలో నిలిచిన నీళ్లను తొలగించడానికి మెట్రో వాటర్ వర్క్స్, ఫైర్ సర్వీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఇండ్లపై హైటెన్షన్ లైన్లు పోయే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, రాష్ట్రవ్యాప్తంగా ఈ లైన్ల తొలగింపునకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
-రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారు. వారిలో జీహెచ్ఎంసీ పరిధిలో 11 మంది ఉన్నారు.
-రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వీటిలో సగం పంటలకు నష్టం కలిగినా వాటి విలువ రూ.రెండువేల కోట్లు ఉంటుంది.
-జీహెచ్ఎంసీలో పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. దీనివల్ల చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా చెరువుల ఎఫ్​టీఎల్ పరిధిలో ఉన్న కాలనీల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. అపార్టుమెంట్ల సెల్లార్లలో కూడా నీరు రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగింది. హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఎల్ బీ నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. హైదారాబాద్ నగరంలో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జీహెచ్ఎంసీ, ఎన్ డీ ఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. 445 చోట్ల బీటీరోడ్లు, ఆరుచోట్ల నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయి. అన్ని చోట్ల రోడ్ల పునరుద్ధరణ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి, ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించడం జరిగింది. ఇండ్లలో నీళ్లు చేరినందున రోజు దాదాపు లక్షా పది వేల మందికి భోజనం అందిస్తున్నాం.

– జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వర్షాలు, వరదల ప్రభావం ఉంది. 238 కాలనీలు జలమయమయ్యాయి. 150 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
-ట్రాన్స్ కో పరిధిలో 9 సబ్ స్టేషన్లు, ఎస్ డీసీఎల్ పరిధిలో 15 సబ్ స్టేషన్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 2 సబ్ స్టేషన్లలోకి నీళ్లు వచ్చాయి. అన్ని చోట్ల యుద్ధ ప్రాతిపదికన నీళ్లను తొలగించాం. లోతట్టు ప్రాంతాలు, సెల్లార్లలో నీళ్లున్న అపార్టు మెంట్లకు విద్యుత్ సరఫరా తొలగించాం. నీళ్లు తొలగించే పనులు జరుగుతున్నాయి. నీళ్ల తొలగింపు పూర్తయిన చోటల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతోంది.
-రాష్ట్రవ్యాప్తంగా 101 చెరువు కట్టలు తెగాయి. 26 చెరువు కట్టలకు గండ్లు పడ్డాయి. జల వనరుల శాఖకు రూ.50కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.
-పంచాయతీ రాజ్ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయి. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. రూ.295 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా.
-ఆర్ అండ్ బీ రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బి పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్ హైవేస్ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా.
– భారీవర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రైతులకు సహాయం అందించేందుకు రూ.600 కోట్లు, జీహెచ్ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.

మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, ఎస్​పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి సునిల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, జలవనరుల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావు, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ పాల్గొన్నారు.