Breaking News

సెక్రటేరియట్​ కూల్చివేత.. మీడియాకు పర్మిషన్​

సెక్రటేరియట్​ కూల్చివేత.. మీడియాకు పర్మిషన్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం పాత భవనాల కూల్చివేత, శిథిలాల తొలగింపు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 90 శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. శిథిలాలు మొత్తం దాదాపు 4500 లారీల లోడు ఉంటుందని అంచనా. ఇందులో ఇప్పటికే రెండువేల లారీల ట్రిప్పులు ఎత్తివేశారు. మిగతా పనులు చకచకా సాగుతున్నాయి. ఎత్తయిన భవనాలను కూల్చివేసే సందర్భంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. అందులో భాగంగా మీడియాను కూడా అనుమతించలేదు.

కూల్చివేత వార్తలు సేకరించడానికి అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధుల నుంచి పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విజ్ఞప్తిని పరిశీలించి, కూల్చివేత పనులు, వ్యర్థాల తొలగింపు పనులకు సంబంధించిన వార్తల సేకరణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ప్రకటించారు. అయితే కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కావునా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వమే మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాన్ని చూపించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు బీఆర్​కే భవన్ నుంచి మీడియా ప్రతినిధులను సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తీసుకెళ్లి సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూపిస్తామన్నారు.