![రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/ASSEMBLY-2.jpg?fit=677%2C391&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సమావేశాల ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. సభ లోపల శానిటేషన్ చేయాలని సూచించారు. అలాగే సమావేశాల బందోబస్తుపై డీజీపీ, పోలీస్ కమిషనర్తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అలాగే కరోనా మహమ్మారి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. సిబ్బంది, పోలీసులు, కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టంలో కొన్ని సవరణ బిల్లుతో పాటు హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లోనూ చట్టాలు చేయాల్సి ఉన్నందున అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు.