Breaking News

మరో మూడు రోజులు వర్షాలు

మరో మూడు రోజులు వర్షాలు

సారథి న్యూస్​, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. తాజాగా, మరో మూడురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. ఇదే జిల్లాలోని అలంపూర్, ఉండవెళ్లి, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, ఇటిక్యాల తదితర మండలాల్లో వాగులు, వంకలు పొంగిపారుతున్నాయి. మానవపాడు మండలం పెద్దపోతులపాడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉండవెళ్లి మండలంలో ప్రాగటూర్ గ్రామానికి వెళ్లి దారిలో పెద్దవాగు ఉప్పొంగుతోంది. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే మొలుస్తున్న పంట పొలాలు ఊటకెక్కి మొలకలు చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం లేక మూడేళ్లుగా నష్టపోయామని, ఈ ఏడాది కాలం మంచిగానే అవుతుందనుకున్న సమయంలో భారీ వర్షాలకు ఆందోళన నెలకొందని రైతన్నలు చెబుతున్నారు.