Breaking News

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

మరికొద్ది గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్​

సారథి న్యూస్​, హైదరాబాద్‌: గ్రేటర్​ ఎన్నికల్లో మరో కీలకమైన ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. షెడ్యూల్​లో భాగంగా డిసెంబర్​1న పోలింగ్ ​జరగనుంది. 4న ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే నేతల వాగ్దానాలు, హామీలు, వాడీవేడి విమర్శల మధ్య ప్రచారం పర్వం ఆదివారం సాయంత్రం నాటికే ముగిసింది. సిటీలోని మొత్తం 15‌‌0 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. 9,101 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 74,67,256 మంది ఓటర్లు ఉన్నారు. 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వారిలో టీఆర్‌ఎస్‌ నుంచి 150, బీజేపీ నుంచి 149, కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులు 146 చోట్ల పోటీచేస్తున్నారు. అలాగే టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, స్వతంత్రులు 415, ఇతరులు 76 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 60 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 30 స్టాటిస్టికల్​సర్వేలెన్స్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. 36,404 వేల మంది సిబ్బంది పోలింగ్​విధులు నిర్వహిస్తున్నారు. గ్రేటర్‌లో అతిపెద్ద డివిజన్‌ మైలార్‌దేవ్‌పల్లి కాగా, అతిచిన్న డివిజన్‌ రామచంద్రాపురం. ఈ ఎన్నికల కోసం 18,202 బ్యాలెట్‌ బాక్స్‌లు వినియోగిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 2,629 మంది దరఖాస్తు చేసుకున్నారు.