Breaking News

కోదండరాంకు సపోర్ట్​ చేయలేం

సారథి న్యూస్​, హైదరాబాద్​: టీజేఏసీ చైర్మన్​, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాంకు కాంగ్రెస్​ పార్టీ షాక్​ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో జరుగబోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులే పోటీచేస్తారని.. కోదండరాంకు మద్దతు ఇవ్వబోమని ఆ పార్టీ స్పష్టమైన సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో కోదండరాం ఏం చేయబోతున్నారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోనుంది. దుబ్బాక ఉప ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్​ వచ్చేసింది. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానం నుంచి పోటీచేసేందుకు కోదండరాం ఆసక్తిచూపారు. అందుకోసం ఆయన వామపక్షాలు, కాంగ్రెస్​ మద్దతు కూడ గట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలతో తెలంగాణ వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్యం ఠాగూర్ సమావేశమయ్యారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ముఖ్యంగా చర్చించారు. టీజేఎస్​కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకూడదని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పోటీచేస్తే సునాయాసంగా గెలుపొందవచ్చని వారు ఠాగూర్​కు చెప్పారట. వారి విజ్ఞప్తిపై మాణిక్యం ఠాగూర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కోదండారం స్వతంత్రగానే పోటీచేస్తారా? లేదా తప్పుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సోషల్​మీడియాలో కోదండరాంకు యువత మద్దతు ఇస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయన పోటీచేయాలని వారు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో కోదండరాం ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.