Breaking News

ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

ఏపీ మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

అమరావతి: ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్​నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో శనివారం కన్నుమూశారు. ఇటీవల ఆయన తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ భీమ శంకరరావు(తాతాజీ)తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. శంకరరావుకు కరోనా ప్రబలినట్లు నిర్ధారణ కావడంతో మాణిక్యాలరావు కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 20 రోజుల పాటు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకొచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. తాడేపల్లిగూడెం నుంచి బీజేపీలో సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగారు. 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.
పలువురి సంతానం
మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పందించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధత ఉన్న కార్యకర్తగా, రాష్ట్రమంత్రిగా చిత్తశుద్ధితో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేశారని కీర్తించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని ఆదేశాలు జారీచేశారు. రాజకీయాల్లో మంచినేతను కోల్పోయామని మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్​.చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తంచేశారు. మాణిక్యాలరావు మరణవార్త విని తాను విషాదానికి గురయ్యానని మెగస్టార్​చిరంజీవి ప్రకటించారు. ఎంతో మంచి మనిషి అని, ఓ సామాన్యుడిలా రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులు చేపట్టే స్థాయికి ఎదిగారని కీర్తించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. మాణిక్యాలరావు మృతిచెందిన విషయం తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని అన్నారు.