![అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/congress-2f-1.jpg?fit=677%2C400&ssl=1)
- పవర్హౌస్ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ చేయించండి
- నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే శ్రీశైలం దుర్ఘటన
- సీఎం కేసీఆర్కు రేవంత్, మల్లు రవి, వంశీకృష్ణ లేఖ
సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం పాతాళగంగ పవర్హౌస్ ఘటనపై అన్ని వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయని, సీఐడీ విచారణలో విశ్వసనీయత లేదని కాంగ్రెస్ నేతలు, ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సి.వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కె.చంద్రశేఖర్రావుకు బుధవారం లేఖ రాశారు. నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ఈ ఘటన జరిగినట్టు అర్థమవుతోందని వివరించారు. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆరోపణలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. జెన్ కో సెంట్రల్ఆఫీసులో సంతాపసభ పెట్టకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. అమ్రాబాద్ అడవుల్లో సభ పెట్టుకుని, కన్నీళ్లు పెట్టుకునే దుస్థితికి మీరే కారణమన్నారు. ఘటన వెనక నిర్లక్ష్యం, అవినీతి ఉందనడానికి సాంకేతిక ఆధారాలు ఉన్నాయని, కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి శర్మ కూడా అనుమానం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం దుర్మార్గమని విమర్శించారు. తక్షణం స్పందించకపోతే తదుపరి కార్యాచరణకు వెళ్తామన్నారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు పరిహారం ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం, హైదరాబాద్ లో 500 గజాల చొప్పున జాగా ఇవ్వాలని ఎంపీ రేవంత్రెడ్డి, మాజీఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు.