Breaking News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి
  • బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్

సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీసీలపై చిన్నచూపు ఉందన్నారు. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశాలీలను గొట్టంగాల్లు, పప్పుచారు అన్నారని గుర్తుచేశారు. అదేవిధంగా నల్గొండకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి బీసీ వర్గానికి చెందిన నర్సయ్యగౌడ్ ను ఉద్దేశించి బూరెలు గారెలతో ఏం కాదని అవమానించారని మండిపడ్డారు. కులాల వారిగా ఆత్మగౌరవ సమ్మేళనాలు పెట్టి, గౌరవించినట్లుగా మొసలికన్నీరు కారుస్తున్నారని తెలిపారు. బీసీలను అవమానించిన ఆపార్టీ నాయకులను మునుగోడు బహుజనులంతా ఏకమై చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మన్నెగూడలో కురుమ, యాదవ ఆత్మీయ సమ్మేళనం పెట్టి అన్నం తినేందుకు ప్లేట్ కూడా ఇవ్వకుండా, టీఆర్ఎస్ కరపత్రాలపై, అట్ట పెట్టెలపై అన్నం పెట్టి అవమానించారని ధ్వజమేత్తారు. మునుగోడులో మీ దొరల అహంకారాన్ని అంతం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క బీజేపీ బిసిల కులగణన చేయకుండా మోసం చేయడమే కాక, నేతన్నలపై జీఎస్టీ భారం మోపారని విమర్శించారు. అనంతరం మర్రిగూడలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మర్రిగూడ మండలంలోని చర్లగూడం ప్రజలను మోసం చేసి వేల ఎకరాల భూములను గుంజుకొని ప్రజలను నిరాశ్రయులను చేశారని విమర్శించారు. మర్రిగూడలో ఆరోగ్య వసతులు కల్పించకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రసూతి వార్డులకు పాములు, వస్తుంటే, చనిపోయిన శవాల పేరుమీద రూ.లక్షల బిల్లులు తీసుకుంటుంటే ఆరోగ్యశాఖ మంత్రి నోరుమెదపడం లేదని ఆరోపించారు. ఒక చిన్న ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి రావడం, సిగ్గుచేటన్నారు. మునుగోడులో ఎన్నికల విధానం సజావుగా సాగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గుర్తుల విషయంలో ఆర్వో అధికారిని మార్చడం, సమయానికి సమాచారం ఇవ్వకుండా పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన వివరాలు తెలపకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఎలాంటి అన్యాయం,అపనమ్మకం లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి శంకరాచారి, జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు, జిల్లా నాయకులు పల్లేటి రవీందర్, బీఎస్పీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.