Breaking News

మోసం చేయడం ఆయన నైజం : భట్టి

మోసం చేయడం ఆయన నైజం: భట్టి

సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ ​మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని తుంగపాడు గ్రామ రైతులతో మాట్లాడారు. నాగార్జున సాగర్ సహా ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ ​ప్రభుత్వం కట్టిందని వివరించారు. ఆ ప్రాజెక్టుల పుణ్యమే మనమంతా అన్నం తింటున్నామని అన్నారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన చట్టాల కారణంగా మద్దతు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉండదని ప్రజలకు వివరించారు. నష్టాలను తట్టుకుని రైతు నిలబడలేడు, భూమిని అమ్ముకోవడమో, ఊరిని వదిలిపెట్టాల్సివస్తుందని అన్నారు. మహిళలు, రైతులకు రెండు విధాలుగా ఉపయోగపడే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సబ్సిడీతో పనిముట్లు, వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, మద్దతు ధర లేకుండా చేసి కంటితుడుపుగా ఇచ్చే రైతుబంధతో లాభం లేదని రైతులు చెబుతున్నారని అన్నారు. రుణమాఫీ హామీ అమలుచేయకపోవడంతో రైతు రుణ భారం పెరిగిపోతోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్​నాయకుడు అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, శంకర్ నాయక్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తుంగపాడులో ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్​ నాయకులు