Breaking News

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం
  • ఫ్యాన్​గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు
  • మిన్నంటిన వైఎస్సార్​సీపీ సంబరాలు

తిరుపతి: తిరుపతి పార్లమెంట్​ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్​ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్​ కు 8,477, సీపీఎం అభ్యర్థి నెల్లూరు యాదగిరికి 5,027 ఓట్లు మాత్రమే పడ్డాయి. నోటాకు 13,300ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం నెల్లూరు డీకేడబ్ల్యు కాలేజీలో రిటర్నింగ్ అధికారి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గురుమూర్తికి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.

సీఎం జగన్​మోహన్​రెడ్డికి రుణపడి ఉంటా..
గెలుపు అనంతరం గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించిన తిరుపతి పార్లమెంట్​ పరిధిలోని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్​ మోహన్​రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ప్రకటించారు. సీఎం ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్​ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని స్పష్టంచేశారు. పలువురు ప్రముఖులు గురుమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెంట ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూళ్లురుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఉన్నారు.