Breaking News

సెప్టెంబర్​ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

సెప్టెంబర్​ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్ లో ఆయన పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. 20రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ద్వారా పలు అంశాలపై సమగ్రచర్చ జరిపే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి, మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలని అభిప్రాయపడ్డారు. వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు రెడీ కావాలని సీఎం కేసీఆర్​ మంత్రులు, అధికారులను కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉండడంతో సిద్ధం కావాలని కోరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.