Breaking News

సాక్షిగణపతికి విశేష అభిషేకం

సాక్షిగణపతికి విశేష అభిషేకం

శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో బుధవారం ఉదయం సాక్షిగణపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ప్రాముఖ్యం ఉంది. ఈ అభిషేకం ద్వారా అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలి, విజయం లభిస్తుందని చెబుతుంటారు. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుంది చెబుతుంటారు. శ్రీశైల క్షేత్ర పరివార ఆలయాల్లో సాక్షిగణపతి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.

భక్తులు శ్రీశైలం మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో పరమేశ్వరుడి వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామివారిని సాక్షి గణపతి పేరొందాడు. చక్కని నల్లరాతితో మలిచిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరోచేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. అర్చకస్వాములు భౌతికదూరం పాటిస్తూ ఏకాంతంగా సాక్షిగణపతి వారికి విశేష అర్చనలు జరిపించామని ఈవో రామారావు తెలిపారు.