Breaking News

వాళ్ల మృతి బాధించింది

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్​ కట్టబోయి ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. వారి మృతికి పవన్​కల్యాణ్​ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో పవన్​కల్యాణ్​ భారీ కటౌట్​ కడుతుండగా సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌ల‌నం, రాజేంద్ర అనే ముగ్గురు అభిమానులు విద్యుత్​షాక్​తో మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పవన్​కల్యాణ్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన పుట్టినరోజు నాడు ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. గాయపడ్డవారికి జనసేన పార్టీ తరఫున చికిత్స అందజేస్తామని చెప్పారు.