Breaking News

రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

సారథి న్యూస్​, వనపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి పనులను విజయవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జాబ్​కార్డులు ఉన్న కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కొత్తవారికి జాబ్​కార్డులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్​నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. రైతు వేదికల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన నిధులతో వచ్చిన దరఖాస్తులను అనుసరించి మంజూరు చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గాల్లో నాబార్డ్ రుణం ద్వారా గోదాంల నిర్మాణానికి జిల్లా కలెక్టర్లు స్థలాలను సందర్శించి భూ సంబంధిత సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతుబంధు ఖాతాలకు సంబంధించి మిగిలిన రైతుల వివరాలను అప్​లోడ్​చేయాలన్నారు. ఉపాధి పనుల కింద చేపడుతున్న సాగునీటి కాల్వల పూడికతీత, రోడ్లకు ఇరువైపులా ముళ్లపొదల తొలగింపు, అవెన్యూ ప్లాంటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. మున్సిపల్​శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్​ కుమార్​ మాట్లాడుతూ.. వీలిన గ్రామాల్లో వీధిదీపాలు, చెత్తసేకరణ, హరితహారం మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. వానాకాలంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వీడియా కాన్ఫరెన్స్​లో వనపర్తి జిల్లా కలెక్టర్​షేక్​ యాష్మిన్ ​బాషా, అడిషనల్​ కలెక్టర్ ​వేణుగోపాల్​రెడ్డి, ఇన్​చార్జ్​ డీఆర్డీవో కోదండరాములు, డీపీవో రాజేశ్వరి పాల్గొన్నారు.