Breaking News

ముగిసిన అపెక్స్​ కౌన్సిల్ ​మీటింగ్​

ముగిసిన అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్: ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న జలవివాదాలతో పాటు ఇటీవల తలెత్తిన నీటి కేటాయింపుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం ముగిసింది. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొనగా, ఢిల్లీలోనే ఉన్న సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి జన్ పథ్-1 అధికారిక నివాసం నుంచి వీడియోలింక్ ద్వారా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ కీలక భేటీ రెండు గంటల పాటు సాగింది.

సమావేశంలో ప్రధానంగా తెలంగాణ, ఏపీ బలమైన వాదనలు వినిపించాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయగా, కృష్ణానది యాజమాన్య బోర్డు నిబంధనలను పాటిస్తూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని ఏపీ స్పష్టం చేసింది. తాము వాడుకుంటున్నది మిగులుజలాలను మాత్రమేనని, ఇందులో తెలంగాణకు ఎలాంటి నష్టం వాటిల్లందని ఏపీ తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు కృష్ణానదీ జలాలపైనే తమ వాదనలు వినిపించాయి. ఈ సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలను చర్చించాలని అజెండా రూపొందించినప్పటికీ, ఆ నాలుగు అంశాల అనుబంధ అంశాలే ఎక్కువగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తమకు అప్పగించాలని తెలంగాణ కోరగా, ఆ ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించాలని ఏపీ సూచించింది.