సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో కాకుండా ప్రగతి భవన్ లోనే జరగనున్నాయి. ఇక్కడే సీఎం కె.చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను ప్రగతి భవన్ కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏటా గోల్కొండ కోటలో పంద్రాగస్టు సంబరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈనెల 15న ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఏయే జిల్లాలో ఎవరెవరు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారనే విషయాన్ని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, మున్సిపల్చైర్మన్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులు జిల్లాస్థాయిలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.