![నీట్, జేఈఈ ఆపండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/mamatha-sonia.jpg?fit=650%2C395&ssl=1)
ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీట్, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. అయితే ప్రధాని కార్యాలయం నుంచి స్పందన రాలేదు. దీంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆమె భావిస్తున్నారు. ఈ సమావేశంలో పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దాదాపు అందరు ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. పరీక్షలు నిర్వహిస్తే కరోనా ఉధృతమయ్యే అవకాశం ఉందని.. అందుకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే అభిప్రాయపడ్డట్టు సమాచారం.