Breaking News

అడిగిన అందరికీ ‘ఉపాధి’

అడిగిన అందరికీ ‘ఉపాధి’

సారథి న్యూస్, మెదక్: ఆసక్తి ఉండి అడిగినవారు అందరికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్​ సైదులు స్పష్టం చేశారు. బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీల డిమాండ్ ​మేరకు పనులు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తీర్మానం చేసిన పనులకు సంబంధించి రిజిస్టర్లు, వర్క్ ఫైళ్లు, వర్క్ సైట్ బోర్డులు, ఫొటోలు, రికార్డులు, తీర్మానాల ప్రతులను భద్రంగా దాచిపెట్టాలని, ఉన్నతాధికారులు ఏ సమయంలో వచ్చి తనిఖీచేసినా వాటిని చూపించేందుకు రెడీగా ఉండాలని సూచించారు. అంతకుముందు కమిషనర్ సైదులు తూప్రాన్ మండలంలోని ఘనపూర్, చేగుంట మండలంలోని మక్కరజపేట్ గ్రామంలో పనుల రికార్డులను పరిశీలించారు. ఆయనతో పాటు వచ్చిన అధికారిని మాధవిలత వెల్దుర్తి మండలంలోని మానేపల్లి, చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట్ లో చేపట్టిన పనులను పరిశీలించారు. మరో అధికారి కృష్ణమూర్తి కొల్చారం మండలంలోని సంగాయిపేట, అల్లదుర్గ్​ మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామాలను సందర్శించి పనులను, రికార్డులను పరిశీలించారు. నరేష్ కుమార్ (డీబీటీ) నార్సింగి మండల కేంద్రంతో పాటు రామాయంపేట మండలంలోని అక్కన్నపేటను సందర్శించారు. వారి వెంట జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీనివాస్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి తదితరులు ఉన్నారు.