![అక్టోబర్ 2న స్వచ్ఛత దినోత్సవం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ktr.jpg?fit=677%2C411&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపల్ శాఖ తరఫున జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని అక్టోబర్2న స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. గాంధీజీ స్ఫూర్తితో రాష్ట్రంలోని పట్టణాల్లో స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆయన ఆయా కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ బి పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కలిసొస్తే ప్రజలకు అద్భుతమైన సేవలు అందించే అవకాశం వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మించాలని సూచించారు. ఆస్తిపన్ను వసూలుకు సంబంధించి ప్రభుత్వం కల్పించిన వన్టైమ్ సెటిల్మెంట్ కార్యక్రమాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు మంత్రి స్పష్టంచేశారు.