Breaking News

లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ ఇవే

లాక్‌డౌన్‌ గైడ్‌లైన్స్‌ ఇవే


సారథి, హైదరాబాద్​: కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయం, మీడియా, విద్యుత్‌ రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆఫీసులన్నీ 33 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయి. రవాణా విషయానికి వస్తే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. సిటీబస్సులు, జిల్లా సర్వీసులు కూడా లాక్‌డౌన్‌ సడలింపు సమయంలోనే నడుస్తాయి. ఆయా డిపోల పరిధిలో బస్సుల సమయాలను అడ్జస్ట్ చేస్తారు. ఇతర రాష్టాలకు బస్సులు నడపబోమని స్పష్టంచేశారు. అంత్యక్రియలకు 20 మంది.. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖ్యమైన నిర్ణయాలు
– మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.
–20న కేబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.
– యుద్ధప్రాతిపదికన కొవిడ్ వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
– ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించింది.
–అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్వో, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం ఆదేశం.
– రెమిడెసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో కేబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు.
– ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

లాక్ డౌన్ నుంచి మినహాయించిన రంగాలు
– వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్సీఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
– తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
–వైద్యరంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్యసేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
–గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది.
– విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యథాపనిచేస్తాయి.
– జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది.
–జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
– కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
– ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
–ఉపాధిహామీ పనులు యథావిధిగా కొనసాగుతాయి.
– ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
– గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
–అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి.
– అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.
– తెలంగాణ చుట్టూ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం
– ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
–ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
– కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.
– సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియాలను మూసివేయాలని కేబినెట్ నిర్ణయించింది.
– పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి ఆదేశించింది.