Breaking News

రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే
  • తండ్రి కూడా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అనుభవం
  • త్రివిధ దళాల అధికారిగా భారత్‌ సైన్య ఆధునీకరణకు కృషి
  • ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన దిట్ట

న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కుటుంబం అంతా దేశం కోసం ఆర్మీలో పనిచేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రావత్‌ దేశం సైనికంగా బలపడేందుకు అహర్నిశలు పనిచేసేవారు. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయన దిట్ట. భారత ఆర్మీని అధునాతన యుద్ధరీతులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. భారత్‌ రక్షణరంగంలో అతిపెద్ద సంస్కరణలకు జనరల్‌ రావత్‌ మార్గదర్శి. వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్లుగా ఏర్పాటు చేసే గురుతర బాధ్యత ఆయన చేపడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీలో రాజ్‌పుత్‌ కుటుంబంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ భారత సైన్యంలో లెప్టినెంట్‌ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.

  • 1978లో ఇండియర్​ ఆర్మీలో చేరిన రావత్​

సైనిక కుటుంబంలో పుట్టిన జనరల్‌ రావత్‌.. 1978 డిసెంబర్‌ 16న ఇండియన్‌ ఆర్మీలో చేరారు. 11 గోర్ఖా రైఫిల్స్‌ 5వ బెటాలియన్‌లో సేవలందించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. సైన్యంలో ఫోర్‌స్టార్‌ జనరల్‌ స్థాయికి చేరుకున్నారు. 2020 జనవరి 1న భారత్‌ తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణెళి కంటే ముందు బిపిన్‌ రావత్‌ సైన్యాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్‌ 31 నుంచి 2019 డిసెంబర్‌ 31 వరకూ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

  • 2019లో సీడీఎస్​లో నియామకం

దేశంలో మొదటిసారిగా చీఫ్‌ ఆఫ్‌ డిఫేన్స్‌(సీడీఎస్‌) పదవిలో జనరల్‌ బిపిన్‌ లక్ష్మణ్‌ సింగ్‌ రావత్‌ 30 డిసెంబర్‌ 2019లో నియమితులయ్యారు. సీడీఎస్‌ పదవి కంటే ముందు ఆయన చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీకి 57వ ఛైర్మన్‌గా పనిచేశారు. సెప్టెంబర్‌ 29నాటి సర్జికల్‌ స్టైక్స్‌ వ్యూహకర్తల్లో రావత్‌ ఒకరు. ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ హోదాలో నాటి దాడుల ఆపరేషన్‌ను స్వయంగా పరిశీలించారు. 1978లో గూర్ఖా రైఫిల్స్‌లో చేరిన రావత్‌ 2016 డిసెంబర్‌ 31వ తేదీన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి, మూడేళ్ల పూర్తి కాలం కొనసాగారు. ఆర్మీ చీఫ్‌ కాకమునుపు జనరల్‌ రావత్‌ ఈశాన్య రాష్టాల్రతోపాటు పాక్‌, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.