Breaking News

పోలీసుల బస్సుపై ఉగ్రదాడి

పోలీసుల బస్సుపై ఉగ్రదాడి
  • ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
  • ముష్కరులు ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ ఘటనలో తొలుత 14 మంది పోలీసులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఆ తర్వాత చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఇద్దరిలో ఒకరు ఏఎస్సై కాగా, సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ ఉన్నారు. గాయపడిన వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దాడి జరిగిన తీరును బట్టి ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే బాండిపొరలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చిచంపిన సంఘటనను మరవకముందే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఇటీవల కశ్మీర్ లోయలో పోలీసులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 19 మంది పోలీసుల ప్రాణాలు తీశారు.