Breaking News

సౌతాఫ్రికా టు హైదరాబాద్‌

సౌతాఫ్రికా టు హైదరాబాద్‌
  • 11 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌
  • ప్రత్యేక పర్యవేక్షణలో ట్రీట్​మెంట్​

సామాజిక సారథి, హైదరాబాద్‌: సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు. నవంబర్‌ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. దీంతో చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్‌ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన వారందరికీ ప్రత్యేక వైద్యబృందాలు ఆర్టీపీఎస్‌ టెస్టులు చేశాయి. ఇందులో ఇప్పటికైతే 11 మందికి పాజిటివ్‌ అని తేలడంతో మరింత భయాందోళన నెలకొంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్‌ నెమ్మదిగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. బ్రిటన్‌, ఇటలీ, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ సహా మరికొన్ని దేశాల్లో ఇప్పటికే కలకలం సృష్టిస్తోంది. దీంతో అన్ని దేశాలు అలర్ట్​అయ్యారు. కొన్ని దేశాలైతే విదేశీ రాకపోకలను నిషేధించాయి. మరికొన్ని దేశాలు పలు ఆంక్షలు విధించాయి. డిసెంబర్‌ 15వ తేదీ నుంచి విదేశీ విమానాలను అనుమతిస్తామని ప్రకటించిన ఇండియా కూడా నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం హైదరాబాద్‌ చేరుకున్న వారికి పాజిటివ్‌ అని తేలడంతో మరింత భయం ఏర్పడింది. వీరి నమూనాలను సీసీఎంబీకి పంపించారు.