Breaking News

రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?

రైతులను వేధిస్తూ వారోత్సవాలా ?
  • మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి

సామాజికసారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం  కేసీఆర్‌ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం హెచ్చరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సర్వరోగనివారిణి రైతుబంధే అన్నట్లు కరోనా నిబంధనలను కాళ్ల కింద వేసి తొక్కి మరీ చారణా కోడికి బారాణ మసాల తీరుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఎద్దేవాచేశారు. రైతుబంధు వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారో రాష్ట్ర రైతాంగానికి తెలపాలని విజయశాంతి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లాలో ఓ యువరైతు రుణమాఫీ చేయకపోవడంతోనే తన భూమి అమ్ముకున్నానని నిరసన తెలుపుతుంటే అధికారపార్టీ నేతలు అడ్డుకొని కొట్టేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.