Breaking News

సభ్యుల ప్రశ్నలకు నేరుగా సమాధానాలు

– 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
– అధికారులతో స్పీకర్‌ పోచారం సమీక్ష

సామాజికసారథి, హైదరాబాద్‌: ఈ నెల 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్‌శాఖ అధికారులతో శాసనసభలో బుధవారం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉందన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు వేగంగా సమాధానం ఇవ్వాలని సూచించారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపాలన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో అందించాలని చెప్పారు. సమావేశాలు జరిగే రోజుల్లో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ తరఫున ఓ నోడల్‌ అధికారిని నియమించాలన్నారు. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. శాసనసభ పరిసరాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అద్భుతమైన పథకాలను అమలు చేస్తోందన్న ఆయన.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వానికి పేరును తీసుకువస్తున్నారన్నారు.

సభ ప్రశాంతంగా జరగాలంటే పరిసరాలు ప్రశాంతంగా ఉండాలన్నారు. శాసనసభ సమావేశాల కోసం పాస్‌లు జారీ చేయాలని, పాస్‌లు ఉన్న వారినే అనుమతించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, మండలి విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, లెజిస్లేటివ్‌ సెక్రెటరీ నరసింహాచార్యులు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జితేందర్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌ కరుణాకర్‌ పాల్గొన్నారు.