Breaking News

32మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు

32మంది బీజేపీ కార్పొరేటర్లపై కేసులు
  • జీహెచ్ఎంసీ ఆఫీసుపై దాడి ఘటన
  • సీసీ పుటేజ్‌ఆధారంగా కేసులు: సీఐ

సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన 32మంది బీజేపీ కార్పొరేటర్లపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం అధికారులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు.. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం చర్యలు తీసుకున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ఇప్పటికే 10మంది కార్పొరేటర్లపై కేసులు నమోదు చేయగా, బుధవారం మరో 22మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మరికొంత మంది బీజేపీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టనున్నారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడిని టీఆర్‌ఎస్‌పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఖండించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీకి విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్‌ ట్వీట్‌చేశారు. బీజేపీ కార్పొరేటర్లు రౌడీలు, గుండాల్లా వ్యవహరించారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.