Breaking News

హైదరాబాద్ ఘన విజయం

హైదరాబాద్ ఘన విజయం


అబుదాబి: ఐపీఎల్​13లో కీలకమైన మ్యాచ్​లో సన్​రైజర్స్​హైదరాబాద్​ ఘనవిజయం సాధించింది. రాయల్​చాలెంజర్స్ ​బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచి క్వాలిఫయర్‌-2లో అడుగుపెట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని కొద్దిగా కష్టంగానే ఛేదించింది. సన్​రైజర్స్​కీలక ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌(50 నాటౌట్‌; 44 బంతుల్లో 4×2, 6×2), హోల్డర్‌(24 నాటౌట్‌; 20 బంతుల్లో 4×3) జట్టుకు విజయాన్ని అందించడంలో చివరి దాకా నిలిచారు. వార్నర్​(17; 17 బంతుల్లో 4×3)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఎక్కువ సేపు క్రీజ్​లో నిలువలేదు. మనీష్‌ పాండే(24; 21బంతుల్లో 4×3, 6×1) కొద్ది సేపు స్కోరు పరుగెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రియమ్​గార్గ్‌(7) కూడా ఎంతోసేపు ఉండలేదు.

టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫీల్డింగ్‌ తీసుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కోహ్లి(6) విఫలం కాగా, పడిక్కల్‌(1) వెనువెంటనే ఔట్​అయ్యారు. ఆర్సీబీ జట్టులో ఏబీ డివిలియర్స్‌(56; 43 బంతుల్లో 4×5)హాఫ్‌ సెంచరీ చేయగా, అరోన్‌ ఫించ్‌(32; 30 బంతుల్లో 4×3, 6×1) మాత్రమే రాణించిగా, మొయిన్‌ అలీ(0), శివం దూబే(8), సుందర్‌(5).. తక్కువ పరుగులకే వెనుదిరిగారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ మూడు వికెట్లు సాధించగా, నటరాజన్‌ రెండు వికెట్లు తీశాడు. నదీమ్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఆదివారం జరిగే క్వాలిఫయర్‌-2 మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్​తలపడనుంది. ఇక్కడ గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది.