Breaking News

వీసీల నియామక ప్రక్రియ వేగవంతం

వీసీల నియామక ప్రక్రియ వేగవంతం

సారథి న్యూస్, హైదరాబాద్: యూనివర్సిటీ వైస్ చాన్సలర్ల(వీసీ) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, తుది కసరత్తు జరుగుతోందని వివరించారు. సెప్టెంబర్ ​7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులు, ​ఎమ్మెల్యేలతో బుధవారం ప్రగతి భవన్ లో చర్చించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నియామకంలో జాప్యం జరిగిందన్నారు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తిచేయాలన్నారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. ప్రభుత్వపరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృతమైన చర్చ జరగాలని కూడా కోరారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విప్ లు గొంగిడి సునిత, రేగ కాంతారావు, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, చల్లా ధర్మారెడ్డి, గణేష్ గుప్త, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.