Breaking News

రాజస్థాన్​లో ఏం జరుగుతోంది?

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడింది. ఓ వైపు డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ పార్టీపై తిరుగుబాటు చేయగా.. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రణ్​దీప్​ సూర్జేవాలా, అజయ్​ మకెన్​లు జైపూర్​కు చేరుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అశోక్​ గెహ్లాట్​కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. అయితే సచిన్​ పైలట్​ వెంట ఎంతమంది ఉన్నారు.. అతడి వ్యూహం ఏమిటన్నది తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. ఇప్పటికే తాను, తనకు మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ శాసనసభపక్ష సమావేశానికి రావడం లేదని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కాగా కాంగ్రెస్​పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేందరికీ విప్​ జారీచేసింది. ఈ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలపై కఠినచర్యలు తీసుకుంటామని కాంగ్రెస్​ నేతలు హెచ్చరించారు. మరోవైపు సచిన్​పైలట్​ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సోమవారం ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాజస్థాన్​ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నదని రాజస్థాన్ సీఎం అశోక్​ గెహ్లాక్​ ప్రకటించగా.. మీ పార్టీ నేతలను మీరు కాపాడుకోలేక మాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ నేత జోతిరాధిత్య సింథియా కూడా తన మిత్రుడు సచిన్​ పైలట్​కు మద్దతుగా నిలవడం చర్చనీయాంశం అయ్యింది. రాజస్థాన్​లో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆలస్యంగా తేరుకున్న కాంగ్రెస్​ ఈ ఆపదను ఎలా ఎదుర్కొంటుందోనని ఉత్కంఠ నెలకొన్నది.