Breaking News

‘రాజధాని వివాదం’ కేంద్రం క్లారిటీ

ఢిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత నిచ్చింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని.. అది కేంద్రం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టులో కేంద్రం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాల నేపథ్యంలో దోనే సాంబశివరావు అనే హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. రాజధానుల అంశం కేంద్రం పరిధిలోనిదని ఆయన హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్​ సెక్రటరీ లలిత అఫిడవిట్​ దాఖలు చేశారు. రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వం పాత్రలేదని.. ఇది పూర్తిగా రాష్ట్రాల అధికారమేనని అఫిడవిట్​లో స్పష్టం చేశారు. బిల్లుల రూపకల్పన చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదని తమ అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. ఈ అంశంపై నెల 28న తిరిగి విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలోనూ ఈ అంశంపై ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం.. అప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.