Breaking News

మోగిన జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా

మోగింది జీహెచ్​ఎంసీ ఎన్నికల నగారా

  • డిసెంబర్ ​1న మహానగర ఎన్నికలు
  • మేయర్​స్థానం జనరల్ మహిళకు కేటాయింపు
  • 150 వార్డులు.. 9,238 పోలింగ్‌ సెంటర్ల ఏర్పాటు
  • వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4న ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామని వివరించారు. డిసెంబర్‌ 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని స్పష్టంచేశారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని, జీహెచ్‌ఎంసీ చట్టప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ ​20న పోలింగ్‌ బూత్‌ల తుది వివరాలు వెల్లడిస్తామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని చెప్పారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,500 నామినేషన్‌ డిపాజిట్‌ చేస్తామన్నారు. రిటర్నింగ్‌ అధికారి వద్దకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు. ప్రస్తుతం 9,238 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని, తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగిస్తామన్నారు.

ముఖ్యాంశాలు
– నవంబర్​18 నుంచే డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరణ
– నవంబర్‌ 20న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
– నవంబర్‌ 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
– నవంబర్‌ 22న నామినేష్ల ఉపసంహరణకు చివరితేదీ
– ఫిబ్రవరి 10తో జీహెచ్‌ఎంసీ పదవీకాలం ముగియనుంది.
– ప్రతి డివిజన్‌కు ఒక రిటర్నింగ్‌ అధికారి ఉంటారు.
– బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
– ప్రస్తుతం 9,200కు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.
–బల్దియా పరిధిలో 52.09 శాతం పురుషులు, 47.90 శాతం మహిళా ఓటర్లు ఉన్నారు.
– జీహెచ్‌ఎంసీ పరిధిలో 74.4 లక్షల మందికి పైగా ఓటర్లు,
– అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 79,290 మంది ఓటర్లు
– అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,997 మంది ఓటర్లు
– బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌లో మహిళా ఓటర్లు ఎక్కువ
– హైదరాబాద్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించారు.