Breaking News

ములుగు కలెక్టరేట్ కు కొత్త వెలుగు

ములుగు కలెక్టరేట్ కు కొత్త వెలుగు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యాలయం చుట్టూ గడ్డి పరిచి అందమైన పూలమొక్కలను నాటారు. ఆడిటోరియం చుట్టూ మొక్కలు నాటారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. నీటి ట్యాంకు, పెద్ద సంప్​నిర్మాణం పూర్తయింది. వివిధ అవసరాలకు వచ్చే ప్రజానీకానికి కార్యాలయ ఆవరణలో వెయిటింగ్​హాలును ​ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రహరీ ఎత్తు పెంచి, భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. భద్రత, పారదర్శక పాలనకు కలెక్టరేట్ లోని అన్ని సెక్షన్లు, కార్యాలయాల్లో 62 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఆవరణమంతా చదునుచేసి సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతున్నారు. కార్యాలయానికి వచ్చే వాహనాలను క్రమబద్ధంగా బయటే పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆఫీసులకు కొత్త సొబగులు
కార్యాలయం ప్రవేశం వద్ద ఉన్న గ్రామ రెవెన్యూ అధికారుల భవనాన్ని ఆధునీకరించి ఐటీడీఏ, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్​ కార్యాలయానికి కేటాయించారు. జిల్లా సహకార అధికారి కార్యాలయాన్ని తీర్చిదిద్ది, అందులో ములుగు రెవెన్యూ డివిజనల్ అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారుల ఆఫీసుల ఏర్పాటు చేశారు. జిల్లాకు వచ్చే అతిథులు విడిది చేసేందుకు కార్యాలయం పైఅంతస్తులో రెండుసూట్ల గెస్ట్ హౌస్ ​నిర్మాణం పూర్తిచేశారు. జిల్లాలో అధికారులు, సిబ్బందికి ‘ములుగు వెలుగు’ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. జిల్లాలో కాగితరహిత పాలనలో భాగంగా అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. జిల్లాలోని తహసీల్దార్, ఎంపీడీవో ఆఫీసులు, ఏరియా, సామాజిక ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పశువైద్యశాలల మరమ్మతులు, సౌకర్యాల కల్పనకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకచొరవ చూపి, నిధులు సమకూర్చి పనులు పూర్తిచేయించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించడానికి కార్యాలయాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, సౌకర్యాల కల్పనకు జిల్లా కలెక్టర్ విశేష కృషిచేస్తున్నారు.