![బెంగళూరులో అల్లర్లు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/BENGALURU-POLICEEEFF.jpg?fit=700%2C401&ssl=1)
బెంగళూరు: ఒక్క ఫేస్బుక్ పోస్టుతో బెంగళూరు నగరం అట్టుడికింది. తీవ్ర అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీపబంధువు ఫేస్బుక్లో ఓ కులానికి చెందిన వారిని కించపరుస్తూ ఓ పోస్ట్పెట్టాడు. దీంతో ఆ కులానికి చెందినవారంతా భారీగా ఎమ్మెల్యే ఇంటివద్దరకు చేరుకొని ఆందోళనకు దిగారు. బెంగళూరులోని పులకేశి నగర్, భారతి నగర్, కమర్షియల్ స్ట్రీట్, టన్నెరీ రోడ్లో బలవంతంగా దుకాణాలను మూసివేయించారు. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నగరం అంతటా 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేశారు. కులసంఘం ప్రతినిధులతో బెంగళూరు ఈస్ట్ డీసీపీ శరణప్ప సహా సీనియర్ అధికారులు చర్చలు జరిపారు. కాగా ఆందోళనకారులు జరిపిన రాళ్లదాడిలో 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పలు వాహనాలు కాలి బూడిదయ్యాయి. కొందరు దుండగులు తనపై కుట్రపూరితంగా దాడికి తెగబడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దయచేసి ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి విచారణకు ఆదేశించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.