![పత్రికల్లో ప్రకటనలపై హైకోర్టులో విచారణ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ap-high-court.jpg?fit=1064%2C700&ssl=1)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏపీలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పక్షపాత వైఖరిపై సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ వేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని నాగశ్రవణ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే టీడీపీ నేతలే పిటిషన్ వేయించారని, పిల్ను తిరస్కరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సర్క్యులేషన్ ప్రకారం ప్రకటనలు ఇవ్వడం లేదన్నారు. పార్టీ రంగులతో ప్రకటనలు ఇవ్వడం, సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.