Breaking News

పక్కాగా ఆస్తుల వివరాలు నమోదు

పక్కాగా ఆస్తుల వివరాలు నమోదు

  • భూరికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలి
  • ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్​ సమీక్ష

సారథి న్యూస్, హైదారాబాద్: గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్నిస్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదుకాని ఆస్తుల వివరాలను 100శాతం వెంటనే ఆన్ లైన్ చేయాలని సీఎం సూచించారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆస్తులను ఆన్ లైన్ లో నమోదుచేసే ప్రక్రియను మున్సిపల్ అధికారులు, జిల్లా, మండల, గ్రామపంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. డీపీవోలు, ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలన్నారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్ కు శ్రీకారం చుడుతున్నామని సీఎం వెల్లడించారు. ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియతో పాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు చేయాలన్నారు. ఇళ్ల నుంచి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.