![జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు మరో సీటు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/hyd.jpg?fit=677%2C450&ssl=1)
హైదరాబాద్: ఈనెల 4న కౌంటింగ్ నిలిచిపోయిన నేరేడ్మెట్ లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. 668 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. తాజా విజయంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. అయితే ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ కౌంటింగ్ సమయంలో స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ ఈనెల 4న హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించింది. మొత్తంగా తుది ఫలితంలో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా 668 ఓట్ల ఆధిక్యంతో గెలుపుబావుటా ఎగరవేశారు.