Breaking News

నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా..

నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటా..

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, కార్మికులకు 50శాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించారు. తక్షణమే రూ.120కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తాను ఉన్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని స్పష్టంచేశారు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీకి నష్టం.. కార్మికులకు ఉద్యోగ భధ్రత కల్పించే విధివిధానాలపై చర్చించారు. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని, అయినా వెనకడుగువేయకుండా తిరిగి బతికించుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

‘ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భద్రతనిస్తోంది. ఇటీవల విద్యుత్ శాఖలో ప్రైవేట్​ భాగస్వామ్యం పెంచాలని ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. పైగా, వేలాది మంది విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఆధారపడిన కుటుంబాలను కాపాడింది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ సహా ప్రభుత్వరంగం సంస్థలను ప్రైవేట్​పరం చేసుకుంటూ వస్తోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెనకకు పోలేదు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటుంది. అందులో భాగంగా ఆర్టీసీ సంస్థను బతికించుకుని తిరిగి గాడిన పెట్టేదాక నేను నిద్రపోను. నేనున్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంట. సంస్థ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. దాంతో పాటు పేదలకు అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ. ఈ కారణాల చేత ప్రభుత్వం లాభనష్టాల గురించి ఆలోచించకుండా ప్రజారవాణా వ్యవస్థ ఆర్టీసీని కాపాడుకోవాలనుకుంటున్నది. ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలుస్తుంది. కార్మికులకు ఇప్పటికే పెండింగ్​లో ఉన్న రెండు నెల్ల జీతాలను తక్షణమే చెల్లించాలి. అందుకు తక్షణమే ఆర్థికశాఖ రూ.120 కోట్లను విడుదల చేయాలి’ అని సీఎం స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్​ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రులు పువ్వాడ అజయ్​కుమార్​, సబితాఇంద్రారెడ్డి,
సీఎస్​ సోమేశ్​కుమార్​ తదితరులు

కార్గో సేవలను గొప్పగా ఆదరిస్తున్నారు
కరోనా భయంతో కొంత, వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణం చేత, కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోయిందని తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్ష సమావేశంలో సీఎం కు వివరించారు. కాగా, కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కరోనా ముందు నాటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన కార్గో సేవలను ప్రజలు గొప్పగా ఆదరిస్తున్నారని ఈ సందర్బంగా సీఎం తెలిపారు. రాను రాను భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్సెల్ ట్రాన్స్ పోర్టు చేసిన రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను అధికారులను అభినందించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసీకి అదనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని, అందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ అధికారులు.. సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, రెవెన్యూశాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు, ఎంఏయూడీ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.