Breaking News

నిజాం కుమార్తె కన్నుమూత

నిజాం కుమార్తె కన్నుమూత

సారథి న్యూస్​ : చార్మినార్‌ ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ కుమార్తె సాహెబ్‌జాదీ బషీరున్నీసాబేగం(93) పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణంలోని ఉస్మాన్‌కాటేజ్‌ భవనంలో కన్నుమూశారు. ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయసులో 1906 ఏప్రిల్‌ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఆయన సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఈమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు. దక్కన్‌ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్‌ ఖాజీంయార్‌జంగ్‌ చాలాకాలం క్రితమే మరణించారు. ఆమెకు ఒక కుమార్తె షహెబ్‌జాదీ రషీదున్నీసా బేగం, కుమారుడు సంతానం. కుమారుడు సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయాడు. ఇప్పటివరకు ఆచూకీ లభించలేదు. బషీరున్నీసాబేగం భౌతిక కాయాన్ని పురానీహవేలీ సమీప మసీదుకు తరలించి జనాజా నమాజ్‌ నిర్వహించారు. నిజాం మనవడు నవాబ్‌నజాఫ్‌అలీఖాన్‌, మ్యూజియం డైరక్టర్‌ రఫత్‌హుస్సేన్‌ బేగం, క్యూరేటర్‌ అహ్మద్‌అలీ సంతాపం వ్యక్తం చేశారు.

సాహెబ్‌జాదీ బషీరున్నీసా బేగం (పాతచిత్రం)