Breaking News

బిజినేపల్లిలో కీచక ఉపాధ్యాయుడు

బిజినేపల్లిలో కీచక ఉపాధ్యాయుడు

సామాజికసారథి, బిజినేపల్లి: బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా ప్రవర్తించాడు. సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువు దారితప్పాడు. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. బిజినేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయుడు బిజినేపల్లిలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే కాలనీలో మానసిక దివ్యాంగురాలైన యువతి(19) నిస్సహాయతను ఆసరాగా చేసుకుని మూడు రోజులుగా ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడుతున్నాడు. తాజాగా గురువారం ఆ యువతి ఇంట్లో సరిగ్గా ఉండకపోవడం, భోజనం చేయకపోవడం వంటి విషయాలను గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలని గట్టిగా నిలదీశారు. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని చెప్పడంతో అసలు సంగతి తెలిసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాసయ్య ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు వెల్లడించింది. వెంటనే సదరు యువతి అన్నదమ్ముళ్లు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఇలా సమాజంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఇలా చేయడం అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. ఇలాంటి కామాంధులపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్​ చేస్తున్నారు.

One thought on “బిజినేపల్లిలో కీచక ఉపాధ్యాయుడు”

Comments are closed.