Breaking News

దేశమంతా విజయ్ ​దివస్

దేశమంతా విజయ్​దివస్

ఉగ్రవాదుల ముసుగులో కాశ్మీర్‌ను కబళించేందుకు పాకిప్తాస్​ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టి నేటికీ 21 ఏళ్లు. ఈ సందర్భంగా దేశమంతా విజయ్​దివస్​ను జరుపుకుంటోంది.


ఏం జరిగిందంటే..

ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాకిస్తాన్.. ‘భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్ స్వాతంత్ర్యాన్ని ఆకాంక్షించే వాళ్లే’ అని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించాలని చూసింది. కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరన పంజాకు విలవిల్లాడింది. ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్​లోని కార్గిల్ సెక్టార్‌ను ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమి తరిమికొట్టింది. ఈ యుద్ధంలో అమరులైన జవానుల త్యాగాలను స్మరించుకోవడానికి ఏటా జూలై 26న విజయ్ దివస్ జరుపుకుంటున్నాం..
జమ్మూ కశ్మీర్​లోని కార్గిల్‌లో 1999 మే, జూలై మధ్య ఈ యుద్ధం జరిగింది. నాటి పాకిప్తాన్​ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తెలియకుండానే ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ భారత్‌తో యుద్ధానికి దిగాడు. పాకిస్తాన్ ​సైన్యం ఉగ్రవాదుల ముసుగులో మన భూభాగంలోకి ప్రవేశించింది. ఎత్తయిన కొండ ప్రాంతాలు, వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలను ఆక్రమించిన పాక్ బలగాలు.. యుద్ధానికి కాలు దువ్వాయి. స్థానిక గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన భారత సైన్యం.. ఆపరేషన్ విజయ్‌కు శ్రీకారం చుట్టింది.


దెబ్బకు దెబ్బ
ఎత్తయిన మంచు కొండల్లో ఉగ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత ఆర్మీపైకి దాడి ప్రారంభించారు. ఎత్తులో ఉండడం శత్రువులకు అనుకూలంగా మారింది. దిగువన ఉండడం ప్రతికూలంగా మారడంతో భారతీయ సైనికులు ప్రాణాలకు తెగించి మరీ వారితో పోరాటం సాగించారు. ఎంతో సాహసంతో కొండల పైకి ఎక్కి టైగర్ హిల్, టోలోలిగ్ కొండలపై మకాం వేసిన పాక్ సైన్యాన్ని తరిమికొట్టారు. పాకిస్థాన్ మన దేశానికి చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేసింది. దీంతో ఇండియన్ ఆర్మీ మరింతగా రెచ్చిపోయింది. యుద్ధంలో ఓటమి తప్పదని భావించిన పాకిస్తాన్​ జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. సరికదా.. నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలో అడుగుపెట్టిన పాక్ బలగాలు వెంటనే వెనుదిరగాలని హెచ్చరించాడు.


అమరజవానుల త్యాగం
కార్గిల్ నుంచి పాకిస్తాన్ ​బలగాలు వెనుదిరగడంతో భారత సైన్యం మిగతా అవుట్​పోస్టుల్లోని పాక్ సైన్యాన్ని తరిమికొట్టింది. జూలై 26 నాటికి పాక్ ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ భారత సైన్యం తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. సుమారు 73 రోజలపాటు సాగిన ఈ యుద్ధంలో ఎంతో మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బతగిలింది. శత్రుసైన్యాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో అమరులైన జవానుల త్యాగాలను స్మరించుకుందాం..

:: ఆర్​.కే