Breaking News

‘దిశ’ ఫస్ట్ లుక్ విడుదల

సారథిన్యూస్​, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన ట్విట్టర్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. గతేడాది నవంబరు 26న శంషాబాద్ సమీపంలో ఒక వెటర్నరీ డాక్టర్ పై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే కొద్దిరోజులు తర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ కింద నిందితులను ఘటనాస్థలానికి తీసుకెళ్లిన పోలీసులు వారిని అక్కడే ఎన్​కౌంటర్​ చేశారు. దీనిపై అప్పట్లోనే తాను సినిమా తీస్తున్నట్టు ప్రకటించిన ఆర్జీవి.. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక ట్రక్కు పక్కన నిలిపి ఉంచిన స్కూటీ.. దాని ముందు పరిగెడుతున్న నిందితుడి నీడ, అతడిని కాల్చివేస్తున్న తుపాకీ ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఈనెల 26న టీజర్​ను, నవంబర్ 26న సినిమాను విడుదల చేయనున్నట్టు రాంగోపాల్ వర్మ ప్రకటించారు.