Breaking News

ఏడాది పాలన.. ఎన్నో ప్రశంసలు

ఏడాది పాలన..ఎన్నో ప్రశంసలు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం పథకాలను పకడ్బందీగా వర్తింపచేయడంలో జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ సక్సెస్​ అయ్యారు. కలెక్టరేట్‌ అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ‘రైతు భరోసా, మన పాలన మీ సూచన, జగనన్న చేదోడు’ వంటి పథకాలను ప్రణాళికబద్ధంగా అమలుచేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. జగనన్న చేదోడు పథకంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానం, ముస్లిం మైనార్టీలో ప్రథమస్థానం దక్కించుకోవడంపై జేసీ సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ కృషి అంతాఇంతా కాదు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమానికి గాను ఆయనకు మంచి పేరు వచ్చింది. ఏదైనా సమస్యను 24 గంటల్లో పరిష్కరిస్తారన్న పేరుంది. అంతేకాకుండా సమస్యను పరిష్కరించారా.. లేదా..? అని ఆయా శాఖ అధికారులను వెంటనే తెలుసుకునేవారు.


అభివృద్ధిలో తనదైన ముద్ర
గతేడాది చేపట్టిన ‘మిషన్‌ కర్నూలు’లో భాగంగా జిల్లాలోని స్కూళ్లు, హాస్టల్స్‌, హాస్పిటల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ విశేషంగా కృషిచేశారు. ఎప్పడికప్పుడు సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తగిన సూచనల, సలహాలు ఇచ్చేవారు. జిల్లా గ్రంథాయ సంస్థ అభివృద్ధిలో భాగంగా 10 న్యూ బుక్‌ డిపాజిట్‌ సెంటర్లను ప్రారంభించడంతోపాటు నాలుగు గ్రామాల్లో మూసిన లైబ్రరీలను పున: ప్రారంభించారు. ఆదోని మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ డ్రైనేజీ, వాటర్‌ సరఫరా చేసేందకు పైపులైన్‌ , సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు మరమ్మతు తదితర అభివృద్ధి పనులు చేసి అక్కడి ప్రజల ఆదరాభిమానాలు పొందారు.


నవరత్నాల శకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన నవరత్నాలను జిల్లా ప్రజకు వర్తింపజేయడంలోనూ జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ కీలకపాత్ర పోషించారు. వైఎస్సార్‌ కంటివెలుగు, వైఎస్సార్‌ చేదోడు, వైఎస్సార్‌ కాపునేస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర, డాక్టర్​ వైఎస్సార్‌ పింఛన్‌ కానుక, ఆటోమిత్ర, నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు తదితర సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు విశేషంగా కృషిచేశారు. జిల్లాలోని ఆరుశాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ ఏడాది స్కాచ్‌ అవార్డు పొందారు. అందుకు జేసీ–2 సయ్యద్‌ ఖజా మొహిద్దీన్‌ సదరు శాఖ అధికారులతో అభివృద్ధి పనులకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే ఆయాశాఖ అధికారుల స్కాచ్​ అవార్డుకు ఎంపికయ్యారు. కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సూచనలు, సలహాలు పాటిస్తూ జిల్లా అభివృద్ధికి విశేష కృషిచేసిన జేసీ–2సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌ కు జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.