Breaking News

‘ఉస్మానియా’ పురావస్తు భవనం కాదా?

సారథి న్యూస్, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కూల్చివేయాలని ఓ వాదన.. పురాతన భవనమని మరో వాదన ఉందని వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఈ ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ.6కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని తెలుసుకుని చెబుతామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ వ్యాజ్యాలపై తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది.
విద్యాహక్కు చట్టం అమలుపైనా కౌంటర్లు దాఖలు చేయండి
అలాగే, రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడంలేదన్న వ్యాజ్యాలపైనా ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. విద్యాహక్కు చట్టానికి సంబంధించి 2015 నుంచి పలు వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలుపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.