Breaking News

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు

ఆశీర్వచనం ఎందుకు ఇస్తారు?

భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వదిస్తారు. దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృద్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వదిస్తారు. అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం ఉందా ? అవి ఫలిస్తాయా ? అంటే తప్పకుండా ఫలిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సత్ప్రవర్తనతో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పకుండా ఫలిస్తాయి.

ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలుగుతాయి. అకాల మృత్యుదోషాలు తొలగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు వేదపండితులు. గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి మాత్రమేనని గుర్తించుకోవాలి. సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది.

అక్షతాన్ సమర్పయామి

అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకు కూడా ఆ శక్తి వస్తుంది. క్షయం లేని మంత్రాలు, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా ఆభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది. మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఏంతో ప్రాధాన్యం ఉంది. అక్షింతలను సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ‘అక్షతాన్ సమర్పయామి’ అంటూ భక్తిగా అక్షతలు చల్లడం హిందూ సంప్రదాయం. పెళ్లిళ్లు, పేరంటాలలో వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. ఊయల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు. మంత్రించిన అక్షింతలు తలపై చల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెబుతారు. కేవలం పెళ్లిళ్లు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది. బియ్యంలో తగినంత పసుపు, నాలుగు చుక్కలు నెయ్యివేసి అక్షింతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.

  • దిండిగల్ ఆనంద్​శర్మ, సీనియర్ జర్నలిస్ట్, సెల్ నంబర్​: 9666006418