Breaking News

అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?

అరాచకం కావాలా? అభివృద్ధి కావాలా?

సారథి న్యూస్, హైదరాబాద్: ఆరేండ్ల మూడు నెలల పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని మంత్రి కె.తారక రామారావు అన్నారు. కొందరు విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. అరాచకం కావాలా? అభివృద్ధి కావాలో విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీట్​ది ప్రెస్ ​కార్యక్రమంలో మాట్లాడారు. తాను చిన్నప్పటి నుంచి హైదరాబాద్​లోనే పెరిగి చదువుకున్నానని.. ఎర్రమంజిల్​లో ఉంటూ జలమండలి ఆఫీసు మీదుగా బస్సులో వెళ్లేవాడినని తెలిపారు. అప్పట్లో జలమండలి కార్యాలయం ముందు బిందెల క్యూలైన్లను చూసేవాడినని గుర్తుచేశారు. అలాంటి సమస్యను తాము అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే పరిష్కరించామని చెప్పారు. చీకటి తప్పదన్న హైదరాబాద్ లో 24 గంటల పాటు కరెంట్​ఇస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీకి ఆలోచన రాకముందే స్వచ్ఛ హైదరాబాద్ కు సీఎం కేసీఆర్​పూనుకున్నారని అన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ లో 90 శాతం మౌలిక సమస్యలను పరిష్కరించగలిగామని అన్నారు. శానిటేషన్ లో హైదరాబాద్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. పేకాట క్లబ్బులు లేవు.. గుడుంబా గబ్బు లేదన్నారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలు లేవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని యూకే సర్వే సంస్థ చెప్పిందన్నారు. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్ కే తలమానికంగా నిలిచిందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.