Breaking News

‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

  • తెలంగాణలో కొత్తగా ప్రాజెక్టులేవీ చేపట్టలేదు
  • ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవాటినే రీడిజైన్ చేశాం
  • 25న సమావేశంలో అభ్యంతరాలను లేవనెత్తుదాం
  • వ్యూహంపై సీఎం కె.చంద్రశేఖర్​రావు అధికారులకు దిశానిర్దేశం

సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టంచేశారు. నదీజలాల వినియోగం విషయంలో రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా సీఎం నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలను కూడా ఆ లేఖలో పేర్కొంటామని చెప్పారు. తగిన వ్యూహం ఖరారు చేసేందుకు సీఎం బుధవారం ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు
రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని, సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలను తీర్చేలా రీడిజైన్ చేశామని సీఎం చెప్పారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చుచేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టీఎంసీలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం వ్యవహరిస్తుందనే విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని సూచించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణానదుల్లో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో నిలదీయాలని సూచించారు. వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

వారి అభ్యంతరాలు అర్థంపర్థం లేనివే
కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్థం పర్థం లేనివే అని సీఎం స్పష్టం చేశారు. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగతున్న అన్యాయాలపై గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేశామని, ఈ సారి జరిగే అపెక్స్ కౌన్సిల్ లోనైనా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సీఎం కేసీఆర్​ చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, జలవనరులశాఖ సలహాదారు ఎస్.కే జోషి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, ఈఎన్​సీ నాగేందర్ రావు, అధికారులు కోటేశ్వర్ రావు, ప్రసాద్, విజయ్ కుమార్, వెంకట నారాయణ, సీనియర్ అడ్వకేట్ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.