Breaking News

అనుమానం పెనుభూతమై

  • 4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని..
  •  అక్రమ సంబంధం అనుమానంతో ఇద్దరినీ హతమార్చిన వ్యక్తి
  •  పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాలో దారుణం..
  •  తండ్రి కేసులో జైలు నుంచి వచ్చిన పది రోజులకే భార్యను చంపిన నిందితుడు

సారథిన్యూస్​, పెన్ పహాడ్ : సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాకు చెందిన లునవత్ స్వామి, సరోజ దంపతులు.. వీరికి ముగ్గురు పిల్లలు. సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్వామి పలుమార్లు తండ్రి, భార్యను హెచ్చరించాడు. వారిలో మార్పు రావడం లేదని ఆగ్రహించిన స్వామి  నాలుగు నెలల క్రితం మంచం కర్రతో తండ్రి బీక్యాను కొట్టడంతో అక్కడికక్కడే అతను చనిపోయాడు. ఆ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన స్వామి, పది రోజుల క్రితమే బెయిల్ పై జైలు నుంచి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి భార్యభర్తలకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గొడ్డలితో భార్య సరోజను కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.